కుమార సంభవం | | Print | |
మహాగ్రంథాలు - శ్రీ శివ మహాపురాణము | |
మొత్తం ఆరు స్థానాలలో(అగ్ని, మునిపత్నులు, వాయువు, హిమవంతుడు, గంగ, రెల్లుపొదలు) పరిపక్వమైన శివవీర్యం కుమారిస్వామి అనే శిశువుగా పరిణతి చెందింది. ఆ శిశువు రెల్లుపొదల్లో క్యారుక్యారుమని ఏడుస్తూంటే, అక్కడికొచ్చిన విశ్వామిత్రుడు లోకోత్తర తేజంతో వెలిగిపోతున్న అ బాలుడ్నిచూసి తపోదృష్టితో జరిగిందంతా గ్రహించాడు. శివ వీర్యసంజాతుడైన ఈ శిశువు అసామాన్య శౌర్య పరాక్రమ వంతుడైన శక్తిధరుడని ఎరిగి శిరస్సు వంచి నమస్కరించాడు. జాతకర్మాది వైదిక ప్రక్రియలను పూర్తిచేసి తనను వొడ్డున పడేయ మన్నాడు కుమారస్వామి. తాను పుట్టుకతో బ్రాహ్మణుడనుకాను గనుక తనకా అర్హతలేదన్నాడు గాధేయుడు. బ్రాహ్మణుడిగా, శిష్ట గురువుగా తాను విశ్వామిత్రుడిని అనుగ్రహిస్తున్నట్లు కుమారస్వామి చెప్పడంతో, జాతకర్మలు నిర్వర్తించడానికి - పురోహితుడుగా విశ్వామిత్రుడొప్పుకున్నాడు. ఆ తరువాత ఏతెంచిన అగ్నిదేవుడు, కుమారుని చేరదీసి 'శక్తి' అనే ఆయుధాన్ని ప్రసాదించగా, వెంటనే దానిని పరీక్షించడానికి గాను ఒక పర్వతశిఖరాన్ని ఆ ఆయుధంతోతుత్తునియలు చేసిన సాహసీ; అత్యుత్సాహి కుమారస్వామి. ఆరుగురు మునిపత్నులూ చేరి, కుమారస్వామిని తమబిడ్డగా భావించడంతో వారు ఆరుగురి వద్దా ఏక కాలంలో స్తన్యం స్వీకరించాడు. షాణ్మాతురుడయ్యాడు. కైలాసం చేరుకున్న కుమారుడు: ఒకనాడు శివపార్వతుల మధ్య అనురాగ సంగమవేళ ప్రసంగ వశాన - ఆనాటి రేతఃపతన ప్రస్తావన వచ్చింది. ఆ విషయం ఇప్పుడేల? పోనిమ్మన్నాడు ఈశ్వరుడు. అమ్మవారు ఊరుకోలేదు. ఆ వీర్యఫలితం ఎలా పరిణమించినా తనకే కావాలంది. అసలు తన భర్త వీర్యోగ్రత భరించడం ఎవరి వశం? అనే నమ్మకం చేత కూడా ఆవిడ అలా అన్నది. వెంటనే శివుడు త్రిలోకవాసుల కర్మములకు సాక్షిభూతులైన ధర్మ, సూర్య, చంద్ర, వాయు, అగ్ని, జల, భూ , రాత్రిందివ సంధ్యలను రప్పించి సర్వకర్మసాక్షులైన మీకు తెలియని అంశములుండవు. నా తేజోపుంజము వెలువడినది మొదలు రేతో రూపమున ఎక్కడెక్కడ ఏయే రీతుల పరిణమించినదీ వివరించమన్నాడు. వారందరి వల్లా కుమార స్వామి జనన విశేషాలు తెలిసికొన్న ఆదిదంపతులు, " అట్లయినచో అతడు మన కుమారుడే గనుక కైలాసమున వసించుటకు అన్ని విధాలా తగినవాడు" అనడంతో పార్వతీదేవి "అవునవును! పుత్రుని చూడ నాకు కూడా మిక్కిలి వేడుకకగా ఉన్నది" అన్నది. వెంటనే ఆదిదేవుడు కుమారస్వామిని కైలాసానికి తీసుకురావలసిందిగా నందీశ్వరుడికి అనుజ్ఞ ఇచ్చి పంపించాడు. మరుక్షణమే - తన అనుచరగణంతో కృత్తికులున్నచోటు (షష్ఠ మాతృకలున్న ప్రదేశం)కు బయలుదేరిన నందీశ్వరుని అత్యుత్సాహం సమరసన్నాహాన్ని తలపించేదిగా ఉంది. అదే సంరంభంతో కార్తికేయుడున్న తావుకు చేరుకున్న నందీశ్వర గణాలను చూసిన కృత్తికలు భయపడి కుమారునితో చెప్పుకున్నారు. అభయం ఇచ్చిన కుమారస్వామి, విషయం విచారించి రమ్మని తన సన్నిహితులను పంపాడు. నందీశ్వరుడు సగౌరవంగా తనను కైలాసానికి ఆహ్వానింప వచ్చాడని తెలిశాక కుమారస్వామి సంతోషించి "ఈ మాతలు నన్ను విడిచి ఎట్లుందురు? వీరి పుత్రవత్సల్యమే నన్నింత వాడిని చేసినది" అని పలికాడు. కుమారస్వామిని శివపార్వతులు కైలాసానికి రప్పించు కోవాలనుకుంటున్న సంగతి తెలియడంతో కృత్తికలు కూడా ఖేదవదనలయ్యారు. వారికి జ్ఞానోపదేశం చేసి "తల్లులారా! వేదప్రామాణికత ననుసరించి షోడశ మాతృదేవతలు. కడుపున మోసినది, పాలిచ్చి పెంచినది, ఆహారం అందించినది, గురుపత్ని, ఇష్టదేవతాపత్ని, తండ్రి భార్య, సవతి తల్లికి పుట్టిన స్త్రీ సంతానం, మేనత్త/ (మేనమామ భార్య), భార్య తల్లి(అత్తగారు), తల్లి తోబుట్టువులు, అమ్మమ్మ, నాన్నమ్మ, సోదరుని భార్య, సహోదరి, సోదరుల కుమార్తెలు, పుత్రుని భార్య...ఈ 16 మంది మాతృ సమానులు. కనుక పార్వతీమాత ఆజ్ఞ చొప్పున నేను తప్పక కైలాసమునకు వెళ్లి తీరాలి" అంటూ అనునయించాడు. విశ్వకర్మ తనకొరకు ప్రత్యేకంగా నిర్మించి ఇచ్చిన రథాన్ని అధిరోహించి, నంది వీరభద్రాదులు వెంటరాగా కైలాసానికి బయల్దేరాడు కుమారస్వామి. ఆ దృశ్యం, ఆ ఆరుగురు తల్లులకూ కంటనీరు తెప్పించగా, వారికి ధైర్యం చెప్పి "మాతల్లారా! మిమ్ములను విడిచి వెళ్లాలన్నది నా అభిమతం కాదు! అందరం కర్మాధీనులమే కద! అది తప్పించ శక్యం కానిది! ఈ కలయికలు - విడిపోవుటలు అంతా కర్మవశాన జరిగేవే! మీరు కూడా నాతో కైలాసానికి రావలసింది" అని కోరాడు కుమారస్వామి. అందరూ కలిసి కైలాసానికి చేరుకున్నారు. అక్కడ అప్పటికే వారికి, అపూర్వ స్వాగత సత్కార సంరంభాలు సాగుతున్నాయి. శివపార్వతుల సన్నిధిననిలిచిన కార్తికేయ మహాశక్తిధరుడు శిరసు వంచి ప్రణామాలాచరించాడు ఆదిదంపతులకు. వారి దీవెనలు అందుకున్నాడు. ఒకానొక శుభ ముహూర్తమున గొప్ప సభచేసిన శంభుడు, కుమారస్వామికి సర్వదేవసేనాదిపతిగా పట్టాభిషేకం నిర్వర్తించాడు. శాంభవీ విద్యప్రసాదించాడు. వివిధ దైవత ప్రముఖులు దివ్యమైన అస్త్ర శస్త్రాలను,వెలలేని కానుకలను సమర్పించుకున్నారు. అత్యంత వైభవంగా జరిగిన ఆ పట్టాభిషేక మహోత్సవంతో బాటే, కుమారస్వామి కల్యాణంకూడా జరగడం ఇంకొక విశేషం! ప్రజాపతి, తన కుమార్తెయైన దేవసేన నిచ్చి కుమారస్వామితో వివాహం జరిపించాడు. అట్టి మహదానంద సమయంలో, సదానంద స్వరూపుడైన చంద్రశేఖరుడు, దేవతలందరికీ అడిగినదే తడువుగా వరాలు ప్రసాదించ సంకల్పించాడు. తమకు అందరికీ కలిపి ఉన్న ఒకే ఒక కోరిక - 'దుష్టశిక్షణార్ధం ఆవిర్భవించిన కుమారస్వామిని, తారకాసురునిపై యుద్ధానికి పంపుటయే' అని చెప్పగా శివుడు మహానందంగా అనుగ్రహించి, కొడుకును ప్రేరేపించాడు. దానవాధిపతి తారకునికీ - దేవాధిపతి కుమారునికీ భీకరపోరు సంప్రాప్తమైంది. ఆ మహాయుద్ధంలో వీరభద్రాదులందరూ కుమారునికి బాసటగా నిలవగా, కలకలం రేపే రక్కసి మూకలు చెల్లా చెదురయ్యాయి. అతిలోక భయంకరంగా సాగుతున్న ఆ యుద్ధం అవసాన దశకు చేరుకొనే లోపల రాక్షసవీరులు అగణితంగా అసువులు బాశారు. తనకు అగ్నిదేవుడు ప్రసాదించిన 'శాంత శూలం ' చేబట్టాడు శక్తిధరుడు. దంపతుల్లో కెల్లా ఆదిదంపతులూ - ఆదిదేవతలూ అయిన శివపార్వతులను మనస్సులో ధ్యానించి తన వేలాయుధంతో ఓ భీషణ ప్రహారాన్నిచ్చాడు. అంతే! తారకాసురుడు ఓ పెనువృక్షం తుఫాను దెబ్బకు కూలినట్లు నేలకూలాడు. అన్ని లోకాలా కుమారప్రభ దివ్యత్వం వెల్లివిరిసింది. |
0 వ్యాఖ్యలు:
Post a Comment